హైదరాబాద్(వి.వి) : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తున్నదని, సమాజంలోని అట్టడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా సహకార మందించిన రాష్ట్ర ప్రజానీకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరితగతిన పారిశ్రామిక అభివృద్ధి సాధించేందుకుగాను నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టామని, పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఈ విధానంలో పొందుపర్చామన్నారు. గత ఏడాది కాలంగా రాష్ట్రం ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నదని, వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ఏడాది రికార్డుస్ధాయిలో 208 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మన్నవరంలో ప్రధానిచే శంకుస్దాపన చేసుకున్న విద్యుత్ పరికరాల తయారీ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి కొత్త ఊతం వస్తుందన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే నేడు తనముందున్న కర్తవ్యమని రోశయ్య అన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
