పర్యాటకరంగ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల సాధనకు పోరాడుతాం

Fri, 3 Sep 2010, IST    vv
కె.నారాయణ

హైదరాబాద్‌ (వి.వి) : దేశంలో ప్రస్తుతం మందుల తయారీ, పర్యాటక పరిశ్రమలే చాలా లాభసాటి రంగాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కాంట్రాక్ట్‌, ఏజెన్సీ, దినసరి వేతన ఉద్యోగుల రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ రైన నారాయణ మాట్లాడుతూ, సంస్థ ఏటా 200 కోట్ల రూపాయల టర్నోవర్‌తో లాభాలలో ఉందని, ఇందుకు ఉద్యోగుల కార్యదక్షతే కారణమని చెప్పారు. ఇందులో పనిచేస్తున్న 964 మంది కాంట్రాక్ట్‌, 650 మంది ఏజెన్సీ, దినసరి వేతన ఉద్యోగుల సర్వీస్‌ను రెగ్యులర్‌ చేయడం, వారిని సేవలను మరింతగా వినియోగించుకోవడం ద్వారా 1,000 కోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరవచ్చన్నారు. ఉద్యోగ భద్రత లేని కారణంగా దినదిన గండంగా కాలం గడపాల్సి వస్తున్నదని, సర్వీస్‌ను క్రమబద్దీకరణ చేయడం ద్వారా మరింత ప్రోత్సాహాన్ని ఇస్తే సంస్థ అభి వృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయగలరని వివరించారు. సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లను పలుమార్లు సందర్శించానని, వీటిని మరింతగా అభివృద్ధి పర్చడం ద్వారా వ్యాపారం పెరుగు తుందన్నారు. ఏ కోణంలో చూసిన ఈ సంస్థలో పని చేస్తున్న వారందరి ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాల్సిందేనని, ఈ ఉద్యోగులు ఎదుర్కొంటు న్న పలు సమస్యల పరిష్కారానికి సిపిఐ కృషి చేసిందని చెప్పారు. న్యాయ మైన డిమాండ్ల సాధనకు, పర్యాటక సంస్థ ఉద్యోగులు జరిపే పోరాటాలకు తాము సంపూర్ణ మద్దతునిస్తామని, పరిపాలనను స్థంభింపజే యడానికైనా సిద్ధమేనని నారాయణ స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జె.చంద్రశేఖర రావు మాట్లా డుతూ, పోరాటాల ద్వారానే ఉద్యోగులు, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించు కోగలరని చెప్పారు. నష్టాలలో ఉన్న పర్యాటక అభివృద్ధి సంస్థను లాభాల బాటలోకి తెచ్చిన ఘనత కాంట్రాక్ట్‌, ఏజెన్సీ, దినసరి వేతన ఉద్యోగులదేనని అన్నారు. తమను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమానవేతనం చెల్లించాలని కోరడం చాలా న్యాయ మైందని పేర్కొన్నారు. సంస్థలో యూనియన్‌ను మరింత బలోపేతం గావిస్తూ, తమ ఐక్యతను మరింత చాటు కోవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సిపిఐ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి వి.ఎస్‌.బోస్‌ మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పర్యాటక అభివృద్ధి సంస్థలో పనిచేసే ఉద్యోగులు మరింత ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇందులో పనిచేస్తున్న ఉద్యోగు లందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి మాట్లాడుతూ, సంస్థ పురోభివృద్ధిలో తమ కృషి మరవలేనిదని చెప్పారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తే సంస్థ ఉన్నతికి మరింత దోహదపడగలమని అన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్‌, ఏజెన్సీ, దినసరి వేతనంపై సేవలందిస్తున్న వారందరి సర్వీస్‌లను క్రమబద్దీక రించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ, గిరిజన సంక్షేమ సొసైటీ, జెన్‌కోలలో మాదిరిగా తమ ఉద్యోగాలను కూడా రెగ్యు లర్‌ చేయాలని ముఖ్యమంత్రి రోశయ్యకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, నీల్‌రాజ్‌, ఎస్‌.బాలిరెడ్డి, సంయుక్త కార్యదర్శి కె.రాజశేఖర్‌, గ్యాసి, చంద్రమ్మ, కోశాధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు