అధిష్ఠానం ఆపినా... ఆగని ఓదార్పు యాత్ర

Fri, 3 Sep 2010, IST    vv
ప్రజల వెంటే నేను
వైఎస్‌ఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళదాం
ప్రకాశం ఓదార్పులో జగన్‌ : యాత్రలో అపశృతి-ఇద్దరు మృతి
మంత్రి బాలినేని, ఎమ్మెల్యే బూచేపల్లి, ఎమ్మెల్సీ జూపూడి, జెడ్పీ ఛైర్మన్‌లు హాజరు

ఒంగోలు (వి.వి.) : 'నా తండ్రి వై.యస్‌.రాజశేఖరరెడ్డి నాకు పెద్దకుటుంబ బాధ్యతను అప్పగించారు. ఇక నుండి ప్రజల వెంటే నేను ఉంటాను' అంటూ కడప పార్లమెంట్‌ సభ్యులు వై.యస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో శుక్రవారం నుండి ఓదార్పు యాత్రను ఆయన ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు గిద్దలూరు రావాల్సిన జగన్‌ సాయంత్రం 4.30 గంటలకు వచ్చారు. మధ్యాహ్నం నుండే ప్రజలు జగన్‌ కోసం వేచి వున్నారు. గిద్దలూరులోని నాలుగు రోడ్ల కూడలి జనసంద్రాన్ని తలపించింది. పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, వైఎస్‌ అభి మానులు తరలివచ్చారు. ప్రకాశం జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుండి, కర్నాటక నుండి కూడా జగన్‌ అభిమానులు ఇక్కడకు వచ్చారు. మొత్తం మీద మొదటిరోజు జగన్‌ ఓదార్పుయాత్ర ఊహిం చిన దానికన్నా విజయవంతమైంది. ఒకప్రక్క కాంగ్రెస్‌ పార్టీ అధి ష్ఠానం ఓదార్పు యాత్రను ఆపేయాలని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినా జగన్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పుయాత్రను కొనసాగించారు. ఈ యాత్రకు రాష్ట్ర భూగర్భగనుల శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ ఛైర్మన్‌ కాటం అరుణమ్మ, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావుతో పాటు, నెల్లూరు, కడప జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, జిల్లాకు

చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు హాజరయ్యారు. మొదటి రోజు జగన్‌ ఓదార్పుయాత్ర ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో అపశృతి చోటుచేసు కుంది. జగన్‌ను చూడటానికి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బిల్డింగ్‌పైకి ఎక్కగా విద్యుత్‌తీగలు తగిలి ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందారు. జగన్‌ మొదటి రోజు ఆచితూచి ప్రసంగిం చారు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. విమర్శలు ఎక్కుపెట్టలేదు. ఎక్కువగా మాట్లాడకుండా కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గిద్దలూరులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందుతుందంటే అది కేవలం వైయస్‌ఆర్‌ పుణ్యమేనని తెలిపారు. పేద విద్యార్ధులు ఇంజినీరింగ్‌ ఎవరి వల్ల చదువుతున్నారంటూ ప్రజలను ప్రశ్నించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళినప్పుడే వైఎస్‌ ఆత్మకు శాంతికలుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పెద్దకుటుంబాన్ని అప్పగించారని, అందరితో కలిసి అందరి సమస్యల్లో పాలుపంచుకొని మీలో ఒకరిగా ఉంటానని భరోసా ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్‌, 108, 104, మహిళలకు పావలా వడ్డికి రుణాలు, రాజీవ్‌ గృహకల్ప, రాజీవ్‌ ఆరోగ్యశ్రీతోపాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించిన గొప్ప నేత వైఎస్‌ఆర్‌ అని జగన్‌ కొనియాడారు. మొదటిరోజు ఓదార్పుయాత్ర నాలుగు మండలాలు- కొమరోలు, గిద్దలూరు, రాచర్ల, కంభంలలో కొనసాగింది. ఆరు కుటుంబాలను జగన్‌ ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కాటం అరుణమ్మ, జూపూడి ప్రభాకర్‌తో పాటు బద్వేల్‌ ఎమ్మెల్యే రమణమ్మ, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కడప జిల్లా ఎమ్మెల్యే అమరనాధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, ఎఎంసి ఛైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణినాయకులు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు