విశాఖపట్నం : ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా ప్రాంతాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వరుసగా మూడో రోజు కూడా కొనసాగుతోంది. ఇది ఒరిస్సాకు వాయువ్యదిశగా కదిలి, వాయుగుండంగా మారే అవకాశం వుందని భావిస్తున్నారు. అల్పపీడనం ప్రభావం వల్ల కోస్తా ఆంధ్రలో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటలపాటు వర్షాలు ఇదే స్థాయిలో వుండే అవకాశం వుందని విశాఖపట్నంలోని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కోస్తా ఆంధ్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుంది. దీని ప్రభావం వల్ల తూర్పు దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు భారీ ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. వాయువ్య దిశగా కూడా ఇదేస్థాయిలో గాలులు వీస్తాయి. వచ్చే 24 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంటుంది. నేటి ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో రాయలసీమ ప్రాంతంలో 7 సెం.మీ., భీమడోలులో 4 సెం.మీ., ఏలూరు, పాతపట్నం, పలాస, కలింగపట్నంలలో 3 సెం.మీ. చొప్పున, నందిగామ, నూజివీడు, విశాఖపట్నం, శృంగవరపుకోటలలో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
