మాటతప్పిన ప్రభుత్వాలను గద్దెదింపుదాం

Sat, 28 Jan 2012, IST    vv
సిపిఐ నెల్లూరు నగర మహాసభలో కె.నారాయణ

నెల్లూరు (వివి) : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని విద్యుత్‌ ఛార్జీలు పెంచితే బడుగు, బలహీన వర్గ ప్రజల మీద మరింత భారం పడే అవకాశం ఉందని విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోక పోతే అన్ని వామపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దె దిగేవరకు పోరాటం చేస్తామని శుక్రవారం జరిగిన నెల్లూరు నగర 22వ మహాసభల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డా|| కె.నారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సంపూర్ణంగా ఇవ్వకుండానే జీవోలన్నీ కాగితాలకే పరిమితం చేసి విద్యార్థులకు 5కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. విద్యుత్‌ విషయానికి వస్తే పూరి గుడిసెకు కూడా, 500రూలకు తగ్గకుండా విద్యుత్‌ ఛార్జీలు ప్రస్తుతం ఉన్నాయని. ఇవి చాలనట్టు నూతనంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచాలనుకోవడం తద్వారా 7000 కోట్లకు పైగా ప్రజల మీద భారం మోపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయన్నారు. ముందు ప్రభుత్వాన్ని రద్దుచేసి తర్వాత ప్రజా తీర్పుతో గెలిచిన తర్వాత ఛార్జీలు పెంచాలని నారాయణ హితవు పలికారు. మహౌన్నత బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా||బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేయడం జాతికే అవమానకరమన్నారు. దీని వెనుక రాజకీయ అదృశ్యహస్తాల కుట్రదాగివుందన్నారు.

గణతంత్ర స్వాతంత్య్రం ప్రజలకు కాకుండా పాలకులకే పరిమితమవుతుందని, 63 సంవ త్సరాల్లో ఏ గ్రామంలోనూ అభివృద్ధి జరగలేదని, కనీసవసతులకు సైతం నోచుకోని గ్రామాలు న్నాయని అన్నారు. ప్రతిసారీ ఎన్నికల వాగ్దానాలను తుంగలోకి తొక్కుతూ ప్రజలను పాలకులు వంచిస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో సిపిఐ అనేక భూ పోరాటాలు చేసి ఇటు రైతులకు, అటు ఇల్లు లేని నిరుపేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. నగరంలో అన్నివర్గాలను కలుపు కొని తమ పోరాటాలను విస్తరించేందుకు ఈ మహా సభ ఎంతో ఉపయోగపడుతుందని నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో సభాధ్యక్షులు సిపిఐ నెల్లూరు నగర కార్యదర్శి పసుపర్తి నాగేశ్వరరావు (పిఎన్‌ఆర్‌), జిల్లా కార్యదర్శి పముజుల దశరథ రామయ్య, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య, అఖిల భారత శాంతి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పి. మధుసూధన్‌శాస్త్రి, జనవిజ్ఞాన వేదిక నాయకులు డా.జి. విజరుకుమార్‌, మహిళా సంఘం నేతలు వినోదమ్మ, విజయ, ఎఐటియుసి నాయకులు వి.రామరాజు, దామా అంకయ్య, ఎఐవైఎఫ్‌ నాయకులు ఎస్‌కె మునీర్‌, సిపిఐ నాయ కులు అరిగెల నాగేంద్రశాయి, ఎఐఎస్‌ఎఫ్‌ నాయ కులు పి.లీలామోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు