హైదరాబాద్ (వి.వి): వ్యవసాయ రంగంపై ప్రభుత్వ తీరును ప్రతిపక్షాలు ఎండగట్టాయి. రైతులపై నిర్లక్ష్యధోరణిని తీవ్రంగా నిరసించాయి. వ్యవసాయ రంగాన్ని అప్పుల ఊబిలోకి దింపిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టిడిపి సోమవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు భారీ ఎత్తున టిడిపి, సిపిఐ కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షులు ఎన్.చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేతకాని, దగా కోరు, రైతు వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. రైతాంగానికి మాటలు చెబుతున్నారే తప్ప, ఆచ రణలో చేస్తున్నది శూన్యమని మండిపడ్డారు. ఎరు వులు, విత్తనాలు లభించక రైతు అగచాట్లు పడు తుంటే ప్రభుత్వం దద్దమ్మలా చూస్తున్నదని వ్యాఖ్యా నించారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం కాగా, 30 శాతం కూడా సరఫరా చేయ లేదన్నారు. ప్రభుత్వం చెబుతున్న పావలా వడ్డీ ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రుణ వడ్డీ మాఫీ అని మాయమాటలు చెబుతున్నదన్నారు. విత్తనాలు, ఎరువుల కొరకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నా యని ఆవేదన చెందారు. విత్తనాలు అందించడానికి లాటరీ పద్దతిని ఎంచుకుందని ఆయన ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కరెంటును సక్రమంగా అందించ లేదన్నారు. రుణాల రీ షెడ్యూల్ కాలేదన్నారు. కేంద్రం 25 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచిందన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు అడ్డగోలుగా పెరిగాయన్నారు. వర్షాకాలంలో కూడా కరెంట్ కోతను విధిస్తున్నారని ఇదెక్కడి ప్రభుత్వమని ఆయన విమర్శించారు. రెండేళ్లలోనే విద్యుత్పై పదివేల కోట్ల భారం వేశా రని విమర్శించారు. ఆదర్శ రైతుల పేరిట 10 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలకు అనవసరంగా జీతాలిస్తున్నారని మండిపడ్డారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను ఎందుకు అమలు చేయరని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ని ఆందో ళనలు చేసినా ప్రభుత్వానికి రైతాంగంపై కనికరం కలగడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసినా ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదని, రైతుకు చేయూతనిచ్చేందుకు ప్రయత్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి అందరూ సమాయత్తం కావాల న్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ అం శాన్ని తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చనున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని 50 శాతం లాభసాటిగా మారుస్తామని ఆయన పేర్కొ న్నారు. వ్యాన్పిక్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటాన్ని ఇంకా వుధృతం చేస్తామని చెప్పారు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమేనని గ్రహించవలసిందిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతాంగ సమస్యల పరిష్కారానికి జిల్లా, మండల స్థాయిలో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పిలుపు నిచ్చారు. ఇది నిజమైన ప్రభుత్వం కాదని విమర్శిం చారు. అబద్దాలను బొంకుతూ కాలం గడిపేస్తున్న ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వ్యాపా రులు లాలూచీ పడ్డారని అందుకే ఎరువులు బ్లాక్ మార్కెట్ అవుతున్నాయన్నారు. ప్రభుత్వం, ఎరువుల వ్యాపారుల మధ్య లాలూచీ కుస్తీ నడుస్తున్నదని విమర్శించారు. బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్న ఎరువుల వ్యాపారుల లైసెన్సులను రద్దుచేసి వారితో లాలూచీ లేదని ప్రభుత్వం నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాన్ని వ్యాపారులు శాసిస్తున్నారన్నారు. ఇదొక లంచ గొండి ప్రభుత్వమని విమర్శించారు. ముఖ్యమంత్రి కుర్చీ ఊగుతున్నదని, ఆ కుర్చీ నట్లు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద ఉన్నాయని ఎద్దేవా చేశారు. కిరణ్కుమార్రెడ్డి సర్కార్ ఢిల్లీ ఆడిస్తున్న్న కీలుబొమ్మ ప్రభుత్వమని విమర్శించారు. ప్రజలు, రైతులు తిరగబడితే ఈ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరని ఆయన అన్నారు. కార్పోరేట్ వ్యవసాయానికి అనుమతిస్తున్న ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లేలా చూడవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు కె.రామకృష్ణ రైతులకు పిలుపునిచ్చారు. రైతాంగం మొత్తం ప్రభుత్వంపై పోరుకు సమాయత్తం కావలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, అధ్యక్షురాలు పశ్యపద్మ, సిపిఐ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి.ఎస్.బోస్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బాలమల్లేష్లు పిలుపునిచ్చారు. ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ దేశ్పాండే, ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు ప్రభుత్వ తీరును నిరసించారు.
టిడిపి నాయకులు వర్ల రామయ్య కార్యక్రమ సంధాన కర్తగా వ్యవహరించగా, టిడిపి నాయకులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మోతుప్రల్ల్లి నర్సింహులు, పి.మహేందర్రెడ్డి, ఉమామాధవరెడ్డి, కె.ఎస్.రత్నం, దయాకర్రెడ్డి, నన్నపనేని రాజ కుమారి, జైపాల్ యాదవ్, రాములు, పెద్దిరెడ్డి తదితరులున్నారు. ధర్నా అనంతరం నాయకులు చలో సెక్రెటేరియట్కు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరి గింది. చంద్రబాబు , కె.నారాయణ, కె.రామకృష్ణ, రావుల వెంకయ్య, సిపిఐ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి ఈర్ల నర్సింహ, రంగారెడ్డి జిల్లా నాయకులు పుస్తకాల నర్సింగ్రావు, ఆర్.కృష్ణయ్య, నిర్మలాదేవి, లక్ష్మి, కమలమ్మలను పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్దిసేపటి అనంతరం వీరందరినీ విడుదల చేశారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
