యాంగూన్ : అర్థ శతాబ్ధకాలంగా ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశంలో మీడియాకు మయన్మార్ స్వేచ్ఛను కల్పించింది. రాజకీయ, మతపరమైన సమాచారాన్ని ప్రచురించేందుకు ఇప్పటివరకు ఉన్న సెన్సార్ను రద్దు చేసినట్లు సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత కొంతకాలంగా ప్రజాస్వామ్య సంస్కరణలను అమలు చేస్తున్న మయన్మార్ ప్రభుత్వం ఇందులో భాగంగా తాజాగా ఈ సంస్కరణను తీసుకొచ్చింది. ప్రపంచంలో మీడియాపై అత్యధికంగా సెన్సార్ను అమలు చేస్తున్న తొలి పది దేశాల జాబితాలో మయన్మార్కు అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ, జర్నలిస్టుల కోసం ఏర్పడిన కమిటీ (సిపిజె) ఏడో స్థానాన్ని కల్పించింది. ఈ నెల 20వ తేదీ నుంచి మీడియా సంస్థలు అన్నీ కూడా రాజకీయ, మతపరమైన సమాచారాన్ని సమాచార మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి ఆమోదం పొందకుండానే ప్రచురించుకోవచ్చునని సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వాన్ని దూషిస్తూ ఏమైనా రాసినట్లయితే అలాంటి జర్నలిస్టులను శిక్షించేందుకు కఠినచట్టాలు అమలులోనే ఉంటాయని ఈ ప్రకటన స్పష్టం చేసింది. మీడియాపై 50 ఏళ్ళుగా కొనసాగుతున్న సెన్సార్ను ప్రభుత్వం ఇన్నాళ్ళకు తొలగించింది. 1964, ఆగస్టు 6వ తేదీ నుంచి మీడియాపై ఈ సెన్సార్ ప్రారంభమైంది. 48 ఏళ్ళ రెండు వారాల అనంతరం ఇంతకాలానికి తాజాగా ఈ ఆంక్షలను రద్దు చేశారు. 1962 ప్రింటర్ అండ్ పబ్లిషింగ్ చట్టాన్ని ఈ ఏడాది పార్లమెంట్ రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. సంస్కృతి, క్రీడలు, ఫ్యాషన్, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం సమాచారాన్ని ప్రచురించే 173 దినపత్రికలు, వారపత్రికలు, 124 మ్యాగ్జైన్స్పై సెన్సార్ను రద్దు చేస్తున్నట్లు, అయితే, రాజకీయ, మతపరమైన సమాచారంపై మాత్రం ప్రభుత్వం నియంత్రణ ఉంటుందని సమాచార మంత్రి క్యా హసన్ మార్చి నెలలోనే ప్రకటించారు. 1962 నుంచి 2011 వరకు మిలటరీ జుంటా మయన్మార్ను పాలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1990వ దశకంలో ఈ దేశంపై పశ్చిమ దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. కాగా, నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్సాన్ సూకీ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ 2011 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 2011 మార్చిలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. అయితే, పార్లమెంట్ కూడా ఇంకా మిలటరీ నియంత్రణలోనే ఉంది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
