కాశ్మీర్‌లో చైనా బలగాలపై భారత్‌ ఆందోళన

Fri, 3 Sep 2010, IST    vv

బీజింగ్‌/న్యూఢిల్లీ : పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చైనా ప్రవేశించి పలు కార్యక్రమాలు చేపడుతుండటంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తన ఆందోళనలను చైనాకు తెలియచేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని గిల్‌గిత్‌- బల్తిస్తాన్‌ ప్రాంతంలో దాదాపు 11,000 మంది చైనా బలగాలు మోహరించి ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చిన నేపధ్యంలో చైనా చర్యపట్ల భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బీజింగ్‌లో శుక్రవారం చైనా విదేశీ వ్యవహారాల ఉప మంత్రి జాంగ్‌ జిజూన్‌కు చైనాకు భారత్‌ రాయబారి ఎస్‌. జైశంకర్‌కు మధ్య చర్చలు జరి గాయి. ఈ సందర్భంగా భారత్‌ ఆందోళనలను జైశంకర్‌ తెలియచేశారని భారత దౌత్య కార్యాలయ వర్గాలు తెలియచేశాయి. ఆ ప్రాంతంలో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పిఎల్‌ఎ) బలగాలను మోహరించడంపై భారత్‌ ఆందోళనను ఆయన తెలియచేశారు. కాగా కాశ్మీర్‌లోని గిలిగిత్‌ ప్రాంతంలో తమ బలగాలు మోహ రించి ఉన్నాయని వచ్చిన వార్తలను గురువారం చైనా తిరస్కరించింది. జైశంకర్‌ ఢిల్లీ నుండి గురువారం బీజింగ్‌కు తిరిగి వెళ్ళారు. చైనాకు సంబంధించిన ఈ పరిణామాన్ని భద్రతపై కేబినెట్‌ కమిటీ (సిసిఎస్‌)కు వివరించి చెప్పారు. సిసిఎస్‌కు అధ్యక్షత వహిస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మంగళవారం ఈ అంశాన్ని చర్చించారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా బలగాలు ఉన్నాయని అమెరికా నుండి వార్తలు వెలువడు తున్న నేపధ్యంలో ఈ అంశాన్ని తానే స్వయంగా పరిశీలి స్తానని భారత్‌ చెప్పింది. ఆ వార్తలు వాస్తవమైతే పరిణా మాలు తీవ్రంగా ఉంటాయని, దేశ భద్రతకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి విష్ణు ప్రకాశ్‌ సోమవారం ఇక్కడ తెలిపారు. ఉత్తరమండల భారత సైన్యాధ్యక్షులు లెఫ్టినెంట్‌ జనరల్‌ బిఎస్‌ జస్వాల్‌ వీసాను చైనా తిరస్కరించడంపట్ల తలెత్తిన పరిణామాలను కూడా జైశంకర్‌ చర్చించారు. జమ్మూకాశ్మీర్‌లోని బలగాలకు ఆయన నేతృత్వం వహిస్తున్నందునే వీసాను తిరస్కరించి నట్లు ఆయన తెలిపారు. ఇంకా చైనా-భారత్‌ సంబం ధాలపై పలు అంశాలను ఆయన చర్చించారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు