17,18 తేదీల్లో వికారాబాద్‌కు రెడ్‌రిబ్బన్‌ ఎక్స్‌ప్రెస్‌

Thu, 8 Apr 2010, IST    vv
17,18 తేదీల్లో వికారాబాద్‌కు రెడ్‌రిబ్బన్‌ ఎక్స్‌ప్రెస్‌

రంగారెడ్డి,(వి.వి): వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ఈనెల 17,18తేదీలలో రానున్న రెడ్‌రిబ్బన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును జిల్లా మండల సమాఖ్య గ్రూపులు, బుక్‌ కీపర్లు తప్పని సరిగా సందర్శించాలని జిల్లా కలెక్టర్‌ దానకిషోర్‌ ఆదేశించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డిఆర్‌డిఎ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. హెచ్‌ఐవి ఎయిడ్స్‌ విస్తరణను నిరోదించుటకు సంబంధిం చిన వివరాలను దేశ నలుమూలల ప్రజలకు తెలియచెప్పేందుకు, జాతీయ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థ ప్రారంభించిన రెడ్‌రిబ్బన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు జిల్లాకు రానున్న నేపథ్యంలో మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వికారాబాద్‌, తాండూర్‌ల లో గల స్వయం సహాయక బృందాల సభ్యులు, లీడర్లు, ఆఫీస్‌ వర్కర్లు, నర్సింగ్‌ స్కూలు విద్యార్థినీలు విధిగా ఈ రైలును సందర్శించి, హెచ్‌ఐవి ఎయిడ్స్‌ వ్యాధులకు సంబంధించిన పూర్తి ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, మహిళాలు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు అందరూ ఈ రైలును సందర్శించి హెచ్‌ఐవికి సంబంధించిన సమాచా రాన్ని తెలుసుకొని ఎయిడ్స్‌ సోకిన వ్యక్తుల పట్ల వివక్షను రూపుమాపాలని కలెక్టర్‌ సూచించారు. రెడ్‌రిబ్బన్‌ రైలులో నున్న 8 బోగిల్లో 5వ బోగిలో నున్న శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని 2వేల మంది అషా, ఎఎన్‌ఎంలకు శిక్షణ నివ్వాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. ఇందులో యువజన సంఘాల కార్యకర్తలను కూడా చేర్చాలన్నారు. శిక్షణ పొందిన ఈ కార్యకర్తలందరూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్‌ఐవిపై పూర్తి సమాచారాన్ని అందజేసే వీలుంటుందన్నారు. రెడ్‌రిబ్బన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కార్యక్రమాన్ని వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌తో సమావేశం నిర్వహించాల్సిందిగా కలెక్టర్‌ సూచించారు. ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ సహాయ సంచాలకులు నాయుడు మాట్లాడుతూ హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై 96 శాతం ప్రజలను అవగాహన ఉన్నప్పటికి ఖచ్చితమైన సమాచారం లేక అనవసరమైన అపోహాలకు గురవుతుంటారని, రెడ్‌రిబ్బన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సందర్శన వల్ల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశముందని తెలిపారు. ఈ సమావేశంలో సిఇఒ గురవయ్య, డిఆర్‌డిఎ ఎపిడి రవీందర్‌రెడ్డి, డిఎం హెచ్‌ఒ డాక్టర్‌ శోభావతి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ప్రభాకర్‌, జిల్లా కుష్ఠు నివారణ, ఎయిడ్స్‌ కంట్రోల్‌ అధికారిని అనితాదివాకర్‌, రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సంస్థ ఉప సంచాలకులు, నెహ్రు యువకేంద్రం కో ఆర్డినేటర్‌ వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు