పాక్‌సైనిక అకాడమీపై రాకెట్ల దాడి

Sat, 28 Jan 2012, IST    vv
తీవ్రవాదుల అఘాయిత్యం

ఇస్లామాబాద్‌ : గత ఏడాది ఒసామా బిన్‌ లాడెన్‌ హత్య జరిగిన అబోటాబాద్‌లోని ఆవరణకు సమీపంలో వున్న ప్రతిష్టాత్మక పాకిస్తాన్‌ సైనిక అకాడమీపై తీవ్రవాదులు శుక్రవారం రాకెట్ల దాడి జరిపారు.సైన్యాధిపతి జనరల్‌ అష్ఫక్‌ పర్వేజ్‌ కయానీ ఒక సమావేశానికి హాజరై వెళ్ళిన కొన్ని గంటలకు అకాడమీపై రాకెట్ల వర్షం కురిసింది. పట్టణంలో మొత్తం 9 రాకెట్లు పేలాయి. అందులో రెండు అకాడమీ వెలుపలి గోడలుతాకాయి. అయితే తెల్లవారు ఝామున 3.30 గంటలకు జరిగిన దాడి వల్ల ప్రాణనష్టం గానీ ఆస్తి ధ్వంసం కానీ జరిగిన సమాచారం లేదు. పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు అతి చేరువలో వున్న అబోటాబాద్‌లో ఇటువంటి దాడి జరగడం ఇదే మొదలు. అమెరికా నావికాదళ 'సీల్స్‌' కమాండోలు గత ఏడాది రహస్య దాడి జరిపి అల్‌-ఖైదా అగ్రనాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ని హతమార్చినది ఈ పట్టణంలోనే. ఈ దాడి భద్రతా లోపాలకు దర్పణం పడుతోందని అంగీకరిస్తూ, ఇంత వరకు ఎలాంటి అరెస్టులు జరపలేదని అధికారులు తెలిపారు. భద్రతా దళాలు గాలింపు జరుపుతున్నాయి.కమాండింగ్‌ ఆఫీసర్ల సమావేశంలో పాల్గొనేందుకు సైన్యాధిపతి జనరల్‌ కయానీ అబోటాబాద్‌ వచ్చి వెళ్ళిన కొన్ని గంటలకే ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.

అబోటాబాద్‌కి చేరువలో వున్న నవాన్‌షేర్‌ పట్టణంలోని ఇల్యాసీమసీదు వెనుకవున్న కొండలమీద నుండి రాకెట్లు ప్రయోగించినట్లు జిల్లాపాలనాధికారి ఇంతియాజ్‌ హుస్సేన్‌ షా మీడియాకి తెలిపారు. మసీదు వెనుక 9 రాకెట్‌ లాంచ్‌ప్యాడ్‌లను పోలీసులు కనుగొన్నారు. ''మొత్తం 9 రాకెట్లు పేలాయి. మూడు సైనిక అకాడమీ వైపు దూసుకువెళ్ళగా, రెండు ప్రహారీ గొడను తాకాయి'' అని షా చెప్పారు.'అదృష్టవశాత్తు రాకెట్లు గోడ వెలుపల పడటంతో ఎలాంటి నష్టం జరగలేదు మూడు, నాలుగు రాకెట్లు అబోటాబాద్‌ నివాస ప్రాంతాలలో పడ్డాయి, అయితే అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు'' అని ఆయన చెప్పారు. రాకెట్లు పేల్చిన దెవరో ఎవ్వరూ గమనించలేదన్నారు.

పోలీసు, సైన్యం గాలింపు చేపట్టాయి. అయితే ఇంతవరకూ ఎవ్వరినీ అరెస్టు చేయలేదని షా తెలిపారు. అబోటాబాద్‌లో విస్తృత భద్రతా వ్యవస్థ, చెక్‌పాయింట్లు వున్నప్పటికీ, రాకెట్లు ప్రయోగించిన స్థలం అన్ని వైపుల నుండీ ప్రవేశించే అవకాశం కలిగినది, దాని వెలుపలే కొండలు వున్నాయని షా చెప్పారు. ఇప్పటి వరకూ దాడికి బాధ్యత వహిస్తూ ఏ తీవ్రవాద సంస్థా ప్రకటించలేదు.అయితే ఈ సిగ్గు మాలిన దాడి వెనుక వున్నది తీవ్రవాదులేనని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 'ఇది కచ్చితంగా టెర్రరిస్టుల చర్యే' అని షా అన్నారు. లాడెన్‌ కనీసం ఐదేళ్ళపాటు నివసించిన ఆవరణకు అతి చేరువలో సైనిక అకాడమీ వుంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు