మద్యం షాపు ముందు వంటా, వార్పు

Tue, 17 Apr 2012, IST    vv

జమ్మలమడుగు అర్బన్‌ (వి.వి) : పేదల జీవితాలతో చెలగాటమే మద్యం మహమ్మారిపై సమరం సాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య మహిళా లోకానికి పిలుపు నిచ్చారు. కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామంలో మద్యం వ్యతిరేక ఉద్యమంలో భాగంగా మంగళవారం మహిళలు భారీస్థాయిలో ధర్నా నిర్వహించారు. మద్యం షాపుల ముందే వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈశ్వరయ్య, రమణయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ మద్యంపై తిరగబడిన మహిళా లోకానికి అభినందనలు తెలిపారు. మహిళా ఉద్యమానికి సిపిఐ అండదండలుంటాయని చెప్పారు. పెద్ద పసుపుల గ్రామంలో ర్యాలీ నిర్వహించి మద్యం దుకాణం ముందు బైఠాయించారు. అమ్మకాలు జరగకుండా అడ్డుకున్నారు. గ్రామాల్లో మద్యం దుకాణం తొలగించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా సిపిఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐటియుసిలతో మహిళ సంఘాలు కూడా కలిసి వచ్చాయి.

ఎఐటియసి జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య, ఎపి మహిళా సమైఖ్య జిల్లా అధికారి, ఉద్యమ శ్రీకారానికి నడుం బిగించిన పెద్దపసపుల మహిళ నాగేశ్వరమ్మ తదితరులు మాట్లాడారు. ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు గంగిరెడ్డి, సిపిఐ కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, వెంకటశివ, చేనేత నాయకుడు రామకృష్ణ, గంగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సంజీవమ్మ, జమ్మలమడుగు మండల కార్యదర్శి దండు లక్షుమయ్య, దండు రవి తదితరులు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు